ముఖ్య సందేశం - 1
|
|
దగ్గు, జలుబుతో ఉన్న పిల్లలను వెచ్చగా ఉంచాలి. వారు ఎంత వీలైతే అంత ఎక్కువగా తినడానికి, త్రాగటానికి ప్రోత్సహించాలి. శిశువులు, చిన్నపిల్లలు, తమ శరీరంలోని వేడిని సుళువుగా కోల్పోతారు. వాళ్లకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు వారి శరీరాన్ని కప్పి, వెచ్చగా, ఉంచాలి. దగ్గు, జలుబు, నీళ్లు కారే ముక్కు, పులిసిన గొంతు కలిగిన పిల్లలు శ్వాస తీసుకోవటం మామూలుగానే ఉంటే, ఎలాంటి మందులు లేకుండా ఇంటి వద్దనే చికిత్స చేయవచ్చు. వారిని వెచ్చగా ఉంచటం అవసరం. కానీ అతి వేడిగా చేయరాదు. వారు తినటానికి, త్రాగటానికి పుష్కలంగా ఇవ్వాలి. ఆరోగ్య కార్యకర్త సూచించిన ఔషధాలను మాత్రమే ఇవ్వాలి. జ్వరం తో ఉన్న పిల్లల ఒంటిని మామూలు చల్లని నీటిలో స్పాంజి అద్ది తుడవాలి లేదా స్నానం చేయించాలి. అయితే, ఇందుకు అతి చల్లని (శీతల) నీటిని ఉపయోగించరాదు. మలేరియా ప్రబలిన ప్రాంతాల్లో పిల్లలకు వచ్చే జ్వరం అపాయకరం. ఇలాంటి పిల్లలను ఆరోగ్య కార్యకర్త చేత వెంటనే పరీక్ష చేయించాలి. దగ్గు, జలుబు గల పిల్లల ముక్కును తరచూ శుభ్రం చేస్తుండాలి. ముఖ్యంగా పిల్లలు భోజనం చేయటానికి, నిద్ర పోవటానికి ముందర ముక్కును శుభ్రం చేయాలి. తేమ వాతావరణం శ్వాస తీసుకోవటానికి సులభంగా ఉంటుంది. మరిగే నీళ్లు కాకుండా మామూలు వేడి నీటిని గిన్నెలో పోసి, ఆ ఆవిరిని పిల్లలు పీల్చినట్లయితే స్వాంతన చేకూరుతుంది. రొమ్ముపాలు తాగే పిల్లలకు, దగ్గు, జలుబు వచ్చినప్పుడు పాలు త్రాగటం కష్టమవుతుంది. కానీ , రొమ్ముపాల వల్లే శిశువు అనారోగ్యాన్ని తట్టుకొని, ఎదుగుతారు. కనుక, తల్లి తరచూ రొమ్ముపాలు ఇవ్వటం కొనసాగించాలి. శిశువుకు పాలు చీకటం కష్టమైతే, రొమ్ము నుంచి పాలను ఒక శుభ్రమైన కప్పులో పిండి, ఆ కప్పు ద్వారా శిశువుకు తాగించాలి. తల్లి రొమ్ముపాలు లేని శిశువులైతే కొద్ది మొత్తాల్లో ఆహార పానీయాలు తరచూ తీసుకునేలా ప్రోత్సాహించాలి. అనారోగ్యం నుంచి కోలుకున్నాక, ఆ పిల్లలకు కనీసం ఒక వారం పాటు రోజూ అదనంగా ఒకపూట భోజనం ఎక్కువ పెట్టాలి. అనారోగ్యానికి ముందు పిల్లలు ఎంత బరువు ఉన్నారో, ఆ బరువును తిరిగి పొందే వరకూ వారు పూర్తిగా కోలుకోనట్లే లెక్క. దగ్గు, జలుబు సుళువుగా వ్యాపిస్తాయి. దగ్గు, జలుబుతో వున్న వారు పిల్లల సమీపంలో దగ్గటం, తుమ్మటం, ఉమ్మి వేయటం చేయరాదు. |
| <<వెనుకకు ముందుకు>> |


