|
“రొమ్ముపాలు” అనే అంశం గురించి తెలుసుకొని, అమలు చేయటం ఎందుకు
ముఖ్యం అంటే -
తల్లి రొమ్ముపాలు తాగే శిశువులకు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి.
ఇతర పానీయాలు, ఆహారం తీసుకొనే శిశువులతో పోలిస్తే, రొమ్ముపాలు తాగే
శిశువుల పెరుగుదల బాగుంటుంది. శిశువులందరికీ మొదటి ఆరునెలల పాటు తల్లి
పాలను మాత్రమే తాగించినట్లయితే, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది
శిశువులను మృత్యు ముఖం నుంచి కాపాడవచ్చు. ఇంకా లక్షలాది మంది ఆరోగ్యాన్ని,
పెరుగుదలను మెరుగుపరచవచ్చు.
రొమ్ముపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో లభించే పాలపొడి పానీయాలు,
గేదె / ఆవు తదితర జంతువుల పాలు శిశువుల ఆరోగ్యానికి ముప్పు తెస్తాయి.
రొమ్ముపాలకు ప్రత్యామ్నాయంగా లభించే పానీయాలు, పాలపొడి , ఖరీదైనవి. వీటిని
శిశువుకు సరిపడే విధంగా తల్లిదండ్రులు కొనలేనపుడు లేదా వీటిని కలపడానికి
వాడే మంచి నీరు శుభ్రంగా లేనపుడు శిశువు ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం
ఉంటుంది.
దాదాపు ప్రతీ తల్లి తన శిశువుకు రొమ్ముపాలు ఇవ్వగలదు. బిడ్డకు
పాలివ్వలేనని విశ్వాసం లోపించే తల్లులను ఆ శిశువు తండ్రి, బంధు మిత్రులు
ప్రోత్సహించి ప్రత్యక్ష మద్దతు అందజేయాలి. ఆరోగ్య కార్యకర్తలు, మహిళా
సంఘాలు, ప్రసార మాధ్యమాలు, యాజమానులు కూడా శిశువుకు తల్లిపాలు అందేలా
ప్రోత్సాహం అందించాలి.
తల్లిపాలతో కలిగే ప్రయోజనాల సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి.
ఈ సమాచారాన్ని అందించే బాధ్యత ప్రతి ప్రభుత్వం పైనా ఉంది.
-
|
రొమ్ముపాలకు సంబంధించి ప్రతి కుటుంబం, సమాజం ఏయే అంశాలకు తెలుసుకోవలసిన
హక్కు కలిగి ఉంది.
- శిశువుకు మొదటి 6 నెలల పాటు ఆహారమైనా, పానీయమైనా కేవలం తల్లి
రొమ్ముపాలు మాత్రమే అవసరమవుతాయి. మొదటి ఆరు నెలలపాటు ఏ ఇతర పదార్థాలు
గానీ, పానీయాలు గానీ చివరకు మంచి నీళ్లు కూడా శిశువుకు అవసరం ఉండదు.
- హెచ్.ఐ.వి. సోకిన మహిళ రొమ్ముపాల ద్వారా ఆ వ్యాధి శిశువుకు అంటుకొనే
ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన లేదా అనుమానం ఉన్న మహిళ తమ సమీప ఆరోగ్య
కార్యకర్తను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి శిశువుకు
సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.
- పుట్టిన గంట లోపే శిశువుకు తల్లిపాలను ఇవ్వాలి. శిశువును తల్లికి
సన్నిహితంగా (అంటే తల్లి శిశువు చర్మాలు తాకేలాగా ) చేర్చాలి.
- తరచూ పాలివ్వటం ద్వారా రొమ్ముల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాదాపు
తల్లులందరూ తమ శిశువులకు విజయవంతంగా పాలివ్వగలరు.
- శిశువులను, బాలబాలికలను ప్రమాదకర వ్యాధుల నుంచి తల్లిపాలు
రక్షించగలవు. అంతేగాక, తల్లీ, పిల్లల మధ్య విడదీయరాని అనుబంధాన్ని
సృష్టిస్తాయి.
- సీసా పాలవల్ల అనారోగ్యం కలిగి, మరణానికి కూడా దారి తీయవచ్చు. మహిళ తన
శిశువుకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే, ఆమె రొమ్ము నుంచి తీసిన పాలను గానీ
ప్రత్యామ్నాయ రొమ్ము పాలను గానీ ఒక సాధారణమైన కప్పులో (దీన్ని బాగా
శుభ్రపరచాలి) పోసి, శిశువుకు తాగించాలి.
- 6 నెలలువయస్సు దాటిన శిశువుకు వివిధ రకాలైన అదనపు ఆహారాన్ని ఇవ్వాలి.
అయితే, దీంతో పాటు తల్లిపాలను కూడా రెండేళ్లు దాటే వరకూ ఇవ్వాలి.
- ఇంటి నుంచి దూరంగా వెళ్ళే పని / ఉద్యోగం చేసే మహిళ, తాను శిశువుతో
ఉన్నంత సేపు వీలైనన్ని ఎక్కువసార్లు పాలివ్వాలి.
- శిశువుకు పూర్తిగా రొమ్ముపాలిచ్చే మహిళ, మొదటి 6 నెలల లోపు తిరిగి
గర్భం ధరించకుండా 98 శాతం రక్షణ లభిస్తుంది. అయితే, ఈ లోపు ఆమె రుతుక్రమం
పునర్ ప్రారంభం కారాదు. శిశువుకు రొమ్ముపాలు తప్ప ఇతర ఎలాంటి పానీయాలు
గానీ, ఆహారం గానీ ఇవ్వరాదు.
బలపరిచే సమాచారం : రొమ్ముపాలు |
|
ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము:
1
2
3
4
5
6
7 8 9
|