శిశు సంరక్షణ – ఆరోగ్యం

శిశు సంరక్షణలో ఆరోగ్య సంరక్షణకి ప్రముఖ స్థానం ఉంది. అలాగే శిశు ఆరోగ్య రక్షణలో మాతృ సంరక్షణ కూడా ఒక భాగం . తల్లి ఆరోగ్యానికి, శిశు ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరోగ్యంగా ఉన్న తల్లి సంరక్షణలో పిల్లల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం – ఇది సామెత మాత్రమే కాదు. ఆచరణలో పెట్టవలసిన అతి ముఖ్యమైన అంశం కూడా. ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. దేవుడా నీదే భారం, అనే రోజులు పోయాయి. వైజ్ఞానికంగా మానవుడు ఎంత పెరిగాడంటే, రోగాలు – రోగ కారకాలు, రోగ నివారణల గురించి ఎన్నో విషయాలు కనుగొన్నాడు. రోగ కారక సూక్ష్మజీవులు అనారోగ్యం అనేది గుర్తించి వాటిపై విజయం సాధించాడు. మన శరీర ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగే మనం తినే ఆహారం, తాగే నీళ్ళు, పీల్చే గాలి మీద కూడా ఇది ఆధారపడి ఉంది. రోగ కారణాలు, సూక్ష్మజీవుల పాత్ర, రోగ నివారణ, టీకాలు మొదలైన విషయాల గురించి ప్రాథమిక సమాచారం పిల్లలకు, పెద్దలకు కూడా ఉపయోగం.

ఆరోగ్యపరమైన ముఖ్య విషయాలు
  • ఆరోగ్యమే మహాభాగ్యం
  • ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణాహారం తినాలి.
  • కలుషిత ఆహారం తినరాదు.
  • అన్నం, రొట్టెలతో పాటు ఊళ్ళో దొరికే అకుకూరలు, కాయ గూరలు, పండ్లు విధిగా తినాలి.
  • పప్పు పదార్థాల్లో శరీరానికి కావలసిన మాంసకృత్తులు అన్నీ ఉన్నాయి.
  • ఆరోగ్యం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై ఆధారపడి ఉంటుంది.
  • వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి.
  • చాలా వరకు వ్యాధులు సూక్ష్మజీవుల ద్వారా వ్యాపిస్తాయి.
  • గాలి, నీరు, ఆహారం ద్వారా సూక్ష్మజీవుల వ్యాపిస్తాయి.
  • పోషకాహార లోపాల వల్ల వ్యాధులు వస్తాయి.
  • ఈగలు, దోమలు మనకు హాని కలిగించే ప్రథమ శత్రువులు.
  • తినే ఆహారంలో ఖనిజ లవణాలు లోపిస్తే వ్యాధులు వస్తాయి.
  • తినే ఆహారంలో విటమిన్లు లోపిస్తే వ్యాధులు వస్తాయి.
  • అంటువ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.
  • కొన్ని వ్యాధులు అతి ప్రమాదకరమైనవి. వీటి నివారణకు టీకాలు తీసుకోవాలి.
  • గర్భిణీ స్త్రీలు, పిల్లలు టీకాలు సరైన సమయంలో డాక్టర్ సలహా మేరకు విధిగా క్రమం తప్పకుండా తీసుకోవాలి.
  • డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు వేసుకోరాదు.
  • గడువు దాటిన తేదీ తర్వాత ఏ మందును వాడరాదు.
  • రోగనిరోధక శక్తి పెంపొందాలంటే క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి, సంపూర్ణాహారం తినాలి.
  • నిద్ర అలసిన శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. విశ్రాంతి శరీరానికి అవసరం.


వ్యాధులు – కారణాలు – జాగ్రత్తలు
  • రోగాలకు ముఖ్య కారణం – 1) పరిసరాల అపరిశుభ్రత, 2) వ్యక్తిగత శారీరక అపరిశుభ్రత.
  • అలాగే మరికొన్ని సూక్ష్మజీవులు గాలి ద్వారా వ్యాపించి జలుబు, దగ్గు, న్యుమోనియా, ఫ్లూ, క్షయ, కోరింత దగ్గు, డిఫ్తీరియా (గొంతువాపు) మొదలైన వ్యాధులు కలిగిస్తాయి.
  • నీటి ద్వారా కలరా విరోచనాలు (అతిసారం), రక్త విరోచనం (డీసెంట్రీ)) జబ్బులు కలిగించే సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. కలరా, విరోచనాలు కలిగించే సూక్ష్మజీవులు, కలుషిత ఆహారం ద్వారా కూడ వ్యాపిస్తాయి. ఈ రోగాలను ఈగలు కూడా చాలా సులభం గా వ్యాప్తి చేస్తాయి. ఈగలు అన్ని ప్రాంతాలలోనూ వాలుతాయి. పెంటకుప్పలు, మరుగుదొడ్లు – మీద వాలి తిరిగి మనం తినే ఆహారం మీద వాల్తాయి. వాటి కాళ్ళకూ, రెక్కలకూ, రోమాలకు అంటిన మలిన పదార్థాల నుండి సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. ఆ ఈగలే మన ఆహారం మీద వాలుతాయి. ఫలితంగా మన ఆహారం కలుషితమైన మన శరీరం రోగాలకు నిలయం అవుతుంది. పరిశుభ్రత ఆరోగ్యానికి తొలిమెట్టు.
  • చేతులు, కాళ్ళు కడుక్కోవడం, చక్కగా స్నానం చేయడం, తినే ఆహార విషయాల్లో జాగ్రత్తపడడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, రోగాలతో బాధపడే వారికి దూరంగా ఉండడం, లేదా తగిన జాగ్రత్తలతో వారి దగ్గరకు చేరడం లాంటి చర్యలు మన వ్యక్తిగత పారిశుద్ధ్యానికి ఉపయోగపడతాయి.
  • ఉదాహరణకు మన గోళ్ళలో మట్టి ఉందనుకోండి. దాన్ని సాధారణంగా అలాగే వదిలేస్తూ ఉంటాం. అన్నం తినేటప్పుడు గోళ్ళలోని మట్టితోపాటు కొన్ని సూక్ష్మజీవులు కూడా నోట్లోకి పోతాయి. దాంతో జబ్బులోస్తాయి. కాబట్టి గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. కొంత మంది గోళ్ళను పళ్ళతో కొరికి తీసేస్తూ ఉంటారు. అలా చేయరాదు. గోళ్ళను అతి జాగ్రత్తగా పొట్టిగా కత్తిరించాలి. చేతి గోళ్ళనే కాదు, నోటిలో పండ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
  • ప్రతి రోజు పరిశుభ్రంగా స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు, షీకాయ, కుంకుడుకాయలు, సెనగపిండి మొదలైనవి వారివారి అలవాట్లను బట్టి ఉపయోగించాలి. అలా ఉపయోగించడం చాలా మంచిది.
  • అలాగే ఆహారం తినే ముందు, బయటి నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • మన గదులు, గోడలు, గూళ్ళు, కిటికీలు, వరండాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముంగిళ్ళలో ముగ్గులు పెట్టుకోవడం వల్ల పరిశుభ్రతతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉంటుంది.
  • మలేరియా, నిమోనియా, ఫ్లూ జ్వరం, జలుబు, గజ్జి, కంటి జబ్బులు, పోలియో, నంజువ్యాధి, నోటిలోను పెదవుల చివర పుళ్ళు, నీళ్ళ విరేచనాలు, కోరింత దగ్గు, డిఫ్తీరియా, టైఫాయిడ్, గాయిటర్, అనీమియా లాంటి వ్యాధులు పిల్లలకి సోకటానికి ఎక్కువ అవకాశం ఉంది.
  • o అపరిశుభ్రత, ఆహారలోపం, వ్యాధినిరోధక స్థాయి లోపం, సరైన సమయంలో వ్యాధినిరోధక టీకాలు, మందులు తీసుకోకపోవటం వల్ల పిల్లలు వీటివల్ల బాధపడే అవకాశం ఎక్కువ.

    o లేలేత మొక్కలు పెద్దగా ఎండ, వానలని తట్టుకోలేవు. అలాగే పసిపిల్లలు శీతోష్ణ తీవ్రతలనే కాక, రోగకారకాలని కూడా పెద్దగా తట్టుకోలేరు. అందుకే పసిపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాలి. తల్లి, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వ్యక్తులు, స్వచ్ఛంధ సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ శాఖలు – ఇలా అందరి సమన్వయ కృషితోనే శిశు సంరక్షణ సాధ్యం.

    o పసిపిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం పటిష్టంగా ఉంటేనే వారి భావిజీవితం సమాజ భవితవ్యం బావుంటాయి.



శిశు సంరక్షణ - ఆరోగ్యం అన్న విషయంలో అందరూ గుర్తుంచు కోవాల్సిన విషయాలు
  • ఆరోగ్యమే మహాభాగ్యం - ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణాహారం తినాలి.
  • కలుషిత ఆహారం తినరాదు.
  • అన్నం, పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, పండ్లు బలమైన ఆహార పదార్థాలు.
  • బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమ లాంటి ధాన్యాలు, తోటకూర, గోంగూర, చుక్కకూర, అవిశ, మునగ, చేమ, బచ్చలి, మెంతిలాంటి ఆకుకూరలు, బెండ, కాకర, దోస, టమేటా, పొట్ల మునగలాంటి కాయగూరలు పనికిరావని అనరాదు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  • మాంసం, చేపల్లోనే మాంసకృత్తులు ఉన్నాయని అనుకోరాదు. పప్పులు, కోడిగ్రుడ్లలో కూడా మానవ శరీరానికి కావలసిన మాంసకృత్తులు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • ఆరోగ్యం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది.
  • వ్యాధులకు కారణాలు అనేకం, చాలా వరకు వ్యాధులు సూక్ష్మజీవుల ద్వారా వ్యాపిస్తాయి.
  • నీటి ద్వారా కొన్నిరకాల వ్యాధులు వ్యాపిస్తాయి.
  • మంచినీటి బావుల్లో, బ్లీచింగ్ పౌడరు కలపాలి. వానాకాలంలోను, కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ఎక్కువగా ఉన్న రోజుల్లో నీటిని కాచి వడగట్టి చల్లార్చి తాగాలి.
  • ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే వ్యాధుల్ని అంటు వ్యాధులు అంటారు.
  • వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  • పోషకాహార లోపాల వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు మాంసకృత్తులు లోపిస్తే వాపునంజు, శక్తిజనకాలు లోపిస్తే కట్టెనంజు వ్యాధులు వస్తాయి.
  • విటమినులు లోపిస్తే వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు ఏ విటమిన్ లోపిస్తే రేచీకటి, బి విటమిన్ లోపిస్తే నంజువ్యాధి, నోటిపుండ్లు వస్తాయి.
  • ఖనిజ లవణాలు లోపిస్తే వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు అయొడిన్ లోపిస్తే గాయిటర్, ఐరన్ లోపిస్తే రక్తహీనత వస్తాయి.
  • కొన్ని వ్యాధులు అతి ప్రమాదకరమైనవి. వీటి నివారణకు టీకాలు తీసుకోవాలి.
  • గర్భిణీ స్త్రీలు, పిల్లలు టీకాలు సరైన సమయంలో విధిగా క్రమం తప్పకుండా మోతాదు తీసుకోవాలి.
  • డాక్టర్ సలహా లేకుండా అంగట్లో మందులు కొని వేసుకోరాదు. ఎక్స్ స్పయిరి తేది (వాడేందుకు చివరి తేదీ) తర్వాత ఏ మందును వాడరాదు.
  • రోగనిరోధక శక్తి పెంపొందాలంటే క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి. సంపూర్ణాహారం తినాలి.
  • నిద్ర అలసిన శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. విశ్రాంతి శరీరానికి అవసరం.


ఆధారం : మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్




Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: